(1) ఊరేగే మేఘమాల
ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఏ నాడు దాచుకున్న భాగ్యమో ఈ జన్మలో
బాల్యంలోనే భక్తి మొగ్గ తొడిగింది. పది పదిహేను సంవత్సరాల మధ్య వయస్సులో
భగవంతుని చూడాలని తీవ్రంగా పరితపించే వాణ్ణి. ఆ బాధలో ఆకలి వేస్తున్నా ఒక్కో
పూట అన్నం తినేవాణ్ణి కాదు. ఆరోగ్యం సరిగ లేదని సాకు చెప్పి, దుప్పట్లో తల
దూర్చి రోదించే వాణ్ణి. ఆ దశలో భగవంతుడంటే ఏమిటో కూడా తెలియదు. భగవద్గీత
తెలియదు. జ్ఞానము అసలే లేదు. భగవంతుని కొరకు వ్యధ చెందడమే తెలుసు.
మా ఊరి సమీపంలో నది ప్రవహిస్తూ ఉంటుంది. దూరమైనా, అక్కడికి వెళ్ళి
కూర్చొనేవాణ్ణి. చల్లని నదీ జలాన్ని పానం చేసి, పచ్చని మామిడి చెట్లను చూస్తూ,
దూరంగా గోచరించే గిరి శిఖరాలను వీక్షిస్తూ, ఏకాంతంలో కొన్ని గంటలు ఉండిపోయే
వాణ్ణి.
కృష్ణుడి కోసం ఆకాశం వైపు చూస్తే మేఘాలు కనుపించేవి. కృష్ణుడు నీలమేఘ
శ్యాముడని హరికథలో విన్నాను. ఈ మేఘాలకి కృష్ణుని జాడ తెలిసే ఉంటుంది
అనిపించింది. అవి కృష్ణుణ్ణి చూస్తున్నాయి అని భావించాను. వాటిని చూస్తూ
విలపించాను. నన్ను కృష్ణుణ్ణి చూడ నివ్వండి అని ప్రార్థించాను. ఓ మేఘమా! నువ్వు
కొద్దిగా జరుగు, నేను కృష్ణుణ్ణి చూస్తాను అని ఏడ్చాను. మేఘం అలా తేలిపోతూ
ఉంది. కాని, కృష్ణుణ్ణి తన వెనుకే పెట్టుకొని నాకు చూపకుండా తీసుకెళ్ళి పోతోందని
అనిపించింది. చాలా బిగ్గరగా రోదించాను. కృష్ణుణ్ణి చూపమని పెద్దగా ఏడ్చాను. అదొక
పిచ్చి గానే ఇప్పుడు అనిపించవచ్చు. కాని, ఆ వయస్సులో అదొక అనుభూతి. ఇప్పటికీ
ఆ అనుభూతి నాలో పచ్చగానే ఉంది. వెచ్చగానే ఉంది. ఆ నాటి సన్నివేశాన్ని నాలో
నేను స్మృతికి తెచ్చుకున్నప్పుడు ఈ పాట వ్రాశాను.